స్కూల్ విద్యార్థులకు ప్రాజెక్టుల ప్రదర్శనకు అవకాశం
28న అపోలోలో సైన్స్ ఎగ్జిబిషన్ స్కూల్ విద్యార్థులకు ప్రాజెక్టుల ప్రదర్శనకు అవకాశం చిత్తూరు: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరులోని ది అపోలో యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28న స్కూల్ స్థాయి సైన్స్ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ప్రొ. ఆర్. సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేస్తూ… పాఠశాల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, పరిశోధనా ఆసక్తిని పెంపొందించడమే ఈ ఎగ్జిబిషన్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. యువ ఆవిష్కర్తలు తమ వినూత్న ఆలోచనలు, శాస్త్రీయ నమూనాలను ప్రదర్శించేందుకు ఇది ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని తెలిపారు. చిత్తూరు జిల్లాలోని పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆసక్తిగల విద్యార్థులకు సైన్స్ నమూనాలను ప్రదర్శించే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో గణిత, భౌతిక–రసాయన, జీవ, పర్యావరణ శాస్త్రాల విభాగాల్లో విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించవచ్చని తెలిపారు. రోజువారీ జీవితంలో గణిత వినియోగం, శక్తి వనరులు, విద్యుత్, రసాయనిక ప్రతిక్రియలు, ఆరోగ్యం, బయోటెక్నాలజీ, వాతావరణ మార్పులు, పర్యావరణ సంరక్షణ వంటి అంశాలపై నమూనాలను ప్రదర్శించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతి విభాగంలో ఉత్తమ ప్రాజెక్టులకు ప్రథమ బహుమతి రూ.5,000, ద్వితీయ బహుమతి రూ.3,000, తృతీయ బహుమతి రూ.2,000 అందజేయనున్నట్లు వెల్లడించారు. పాల్గొనదలచిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని, వివరాల కోసం 9959540302 నెంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు. ——————————————- ప్రెస్ & పబ్లికేషన్స్ విభాగం ది అపోలో యూనివర్సిటీ, చిత్తూరు